నెల్లూరులోని ఉదయగిరి దుర్గాన్ని గజపతుల సామంతుడైన పూసపాటి బసవరాజు పాలించేవాడు. అతని కొలువులో కవులుగా దూబగుంట నారాయణకవి, దగ్గుపల్లి దుగ్గనలు వుండేవారు.బసవరాజుకు మంత్రిగా పెసరువాయ గంగన్న వుండేవాడు.ఇతనికే దగ్గుపల్లి దుగ్గన నాసికేతోపాఖ్యానం అంకితమిచ్చాడు. గంగన్నకు కృష్ణమిశ్రుడు (1098 A.D) సంస్కృతంలో వ్రాసిన ప్రభోదచంద్రోదయాన్ని తెలుగులో వ్రాయించుకోవాలనే కోరికవుండేది. ఎవరాపని చేయగలరని విచారిస్తే మల్లయ్య, సింగయ్యలు ఇందుకు కడు సమర్థులని తెలిసింది.అలా ప్రభోదచంద్రోదయం తెలుగులో వెలసింది.
కొన్ని కారణాల వలన ఈ జంటకవులు దేవకిపురం చేరారు. దీనికే దేవకాపురమని పేరు కూడా. తమిళనాడులోని ఉత్తరు ఆర్కాడులోని అరణి తాలూకాలో ఈ దేవకీపురం వుంది. దేవకీపురాన్ని గురించి ఎందుకు చెప్పాల్సివుందంటే ఇది నరసనాయకుడికి పుట్టిల్లు. నరసనాయకుడి నాయనమ్మ పేరు దేవకిదేవి. ఈమె పేరున దేవకాపురాన్ని నిర్మించడం జరిగింది. నరసనాయకుడేవరంటే శ్రీకృష్ణదేవరాయల తండ్రి.దేవకాపురంలో వున్న బృహదీశ్వరాలయం ఇప్పటికి ప్రసిద్ధి.
నందిమల్లయ్య గంటసింగయ్యలను తుళువ నరసరాజు*(నరసనాయకుడు) పిలిపించాడు.వరాహపురాణాన్ని వ్రాసి తనకు అంకితమివ్వాల్సిందిగా కప్పురవీడెం (తాంబులం) అందించాడు.
వీరు వరహాపురాణం పూర్తిగా ఆంధ్రీకరించలేదు. ఇందులో కథాబలం లేకపోయినా చిత్రవిచిత్ర కవిత్వ ప్రయోగాలు చేసి దానిని శ్రీమంతం** చేశారు.
వీరు రెండక్షరాలతో ఓ కందాన్ని వ్రాశారు. అది..
కాక లికాకలకలకల కోకిలకులలీలక లుల కులుకుకులక లు కే,
కేై కోకు కేలికొలకుల కోకాలీకేలి కులికి కొంక కు కలికీ
ఈ జంటకవులు ఒకే అక్షరంతో అంటే న అక్షరముతో చిత్రకవిత్వాన్ని కందంలో చెప్పారు.
నానననుని ననూన నేనునినుననున్ను నెన్న నీనీననిను
న్నా నౌననొన్ని నానౌ నేనే నను నన్ను నాన నేనను నన్నన్.
ఇంకా పూర్తి పద్యము ఎటునుండి చదివినా ఒకేలా వుండేలాకూడా వ్రాశారు.
సారసనయనా ఘనజఘ నారచితరతారకలిక హరసారరసా
సారరసారహకలికర తారత చిరనాఘజనఘ నాయనరసా.
తుళువ నరసరాజు లేదా నరసనాయకుడి నలుగురు సంతానం. పెద్దవాడు వీరనరసింహరాయలు, రెండోవాడు శ్రీకృష్ణదేవరాయలు మూడు నాలుగవవారు అచ్యుతరాయలు, శ్రీరంగరాయలు. సంతానం పేర్లచివర అందరికి రాయలు అనివుంది కదా! మరి నరసనాయకుడికి రాయలని లేదందుకు ? (పేరు చివరన నాయకుడనేవుంది.) ఎందుకంటే ఇతను రాజుకొడుకూ కాదు,రాజుగానులేడు. కేవలం మహమండలేశ్వరుడు, సేనాని. ఇలాంటి వారిని నాయకుడని ఆ రోజులలో పిలిచేవారు. అయితే ఇతను సాళువ నరసింహరాయల అనంతరం అతని కొడుకులైన పసిబాలురైన తిమ్మ భూపాలునికి,రెండో నరసింహరాయల వద్ద రాజప్రతినిధిగా ఉండేవాడు.
1503 లో వీరనరసింహరాయలు,సాళువ రెండో నరసింహరాయలను తొలగించి విజయనగర సింహాసనాన్ని ఆక్రమించి తుళువ వంశపాలనకు కారకుడైనాడు. ఇతని అనంతరం కృష్ణదేవరాయలు, ఇతని తరువాత అచ్యుతరాయలు, ఇతని తరువాత అచ్యుతరాయలు, ఇతని అనంతరం శ్రీరంగరాయల కొడుకైన సదాశివరాయలు రాజ్యానికి వచ్చారు. 1572లో తుళువ వంశానికి చెందిన సదాశివరాయల అనంతరం ఆరవీటి వంశం శ్రీరంగరాయలతో మొదలైంది.
చాలామంది సీమంతాన్ని శ్రీమంతంగా పలుకుతున్నారు. బాధాకరవిషయమేమిటంటే ప్రముఖ తెలుగు దినపత్రికలో కూడా సీమంతాన్ని శ్రీమంతంగా వ్రాయడం.
చాల్రోజుల కిందట ఇదే పత్రికలో దారిలో సీమజాలి చెట్లు పెరిగి ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందని వ్రాశారు.
కన్నడలో జాలి అంటే తుమ్మచెట్టు. ఈ కంపచెట్లను కాంగ్రెస్ కంప అనంటారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నెహ్రుగారి తొలినాళ్ళలో కరువు కాలంలో W H O సీమనుండి గోధుమలు దిగుమతైనాయి. గోధుమలలో ఈ కంపవిత్తనాలు దిగుమతైనాయి. ఇక్కడ అవి తామరతంపరగా పెరిగాయి.. తెలగులో ఈ చెట్లను సీమకంపలని, సీమతుమ్మని పిలవడం పరిపాటి. ఇంత వరకు ఈ చెట్లకు సరైన తెలుగుపదం లేదనుకొంటా.
ఈ సీమకంపలే వంటచెరుకుగా గ్రామీణంలో వాడుతున్నారు. కనుక కొద్దిగానైనా ఇతరు చెట్లు బతికిబట్టకడుతున్నాయనుకొవచ్చును.
Credit: జి.బి.విశ్వనాథ. అనంతపురం.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి