నీతి శాస్త్రాలు కోపాన్ని ప్రథమ శత్రువుగా చెప్పాయి.
గీతాకారుడూ ఆ విషయాన్నే బోధించాడు. కామంతో క్రోధం జంట కలిసి ఉంటుంది.
కామం తీరనప్పుడు కోపం విజృంభిస్తుంది. పర్యవసానంగా జరగరానివెన్నో జరిగిపోతాయి.
ప్రపంచ వ్యవహారాల్లో ఒక్కోసారి కొందరు మన సహనానికి పరీక్ష పెడతారు. మన సంస్కారాన్ని అనుసరించి ప్రతిస్పందన ఉంటుంది. అవతలి వారి స్థాయి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనకంటే పైస్థాయివారి ముందు ఉగ్గబట్టుకుని మరీ అసహనాన్ని అణిచిపెడతాం. సమానుల ముందు కాస్త బయటపడతాం. దిగువ స్థాయివారి పట్ల అరుదుగా సహనం చూపుతాం.
ఇలా సహనాన్ని మూడు స్థాయుల్లో విభిన్నంగా వ్యక్తపరుస్తాం.
మనలో చాలామందికి నిరీక్షణ పెద్ద పరీక్షగా అనిపిస్తుంది. ఎక్కువ సహనం చూపాల్సిన సందర్భాల్లో నిరీక్షణ ఒకటి.
నిండు సభలో, పెద్దల సమక్షంలో ద్రౌపదిని దుర్యోధనుడు, అతడి సోదరుడు దుశ్శాసనుడు ఘోరంగా అవమానించినప్పుడు- పాండవులు మహాబలశాలురు అయినప్పటికీ... సహనం చూపారు.
సహనంతోనే అరణ్య, అజ్ఞాత వాసాలు చేశారు. ఫలితంగా దైవం వారికి తోడ్పడింది. మహాభారతాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, అనేక జీవన సత్యాలు మనకు గోచరిస్తాయి. అందుకే అది పంచమ వేదంగా గౌరవం పొందింది.
ధర్మరాజును సహనశీలత్వానికి నిలువెత్తు నిదర్శనంగా చెబుతారు.
అలాగని సహనాన్ని చేతగానితనంగా తలపోయకూడదు.
శ్రీకృష్ణరాయబారంలో అజాత శత్రువైన ధర్మరాజు శక్తిగురించి వివరిస్తూ ‘ఆయన అలిగితే సప్త సముద్రాలు ఏకమవుతాయి’ అని హెచ్చరిస్తాడు.
ఎప్పుడూ సహనం చూపేవారిలో ఆగ్రహం రగలకుండా వ్యవహరించాలి. లేకపోతే విపరిణామాలు తప్పవు.
మన చదువులన్నీ ‘అ, ఆ’లతోనే ఆరంభమవుతాయి. ఆధ్యాత్మిక సాధనలూ అంతే.
ఒకేసారి శిఖరస్థాయికి చేరాలని ఆరాటపడటం తగదు. మెట్లెక్కుతూ ఎత్తుకువెళ్లగలం, రెక్కలు కట్టుకుని పక్షిలా ఎగిరిపోలేం. సహనంలోనే విజయం దాగి ఉంటుందనేది విలువైన జీవిత సత్యం.
ఎక్కువ సహనం కలిగినవారు సునాయాసంగా లక్ష్యాలను సాధించగలరు. ఏ మాత్రం సహనం లేనివాళ్లకు అడుగడుగునా ఆశాభంగాలు, అపజయాలు తప్పవు.
మొక్క పాతిన మర్నాడే చెట్టు అయిపోదు. కాయలు కాయదు. చదువు పూర్తికాగానే మెడలో పూలహారం వేసి ఎవరూ ఉద్యోగం ఇవ్వరు.
సమస్యలు లేని మనిషే ఉండడు. అవతార పురుషులు సైతం కష్టాలు అనుభవించారు. కానీ, ధైర్యంగా ఎదుర్కొని, లోకానికి మార్గదర్శకులయ్యారు.
ఆత్మవిశ్వాసంతో కృషిచేస్తే ఏదీ అసాధ్యం కాదు. కృషికి సహనం తోడైతే ఆ వ్యక్తికి ఎదురు లేదు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి