" ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను.
" లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను"
" అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను
" వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది.
"ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను.
"ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా.
" చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడికి ఈవేళ బాగా బుద్ది చెప్పాలి." అన్నాను.
" అమ్మా. చేతల్లోనే కాదు మాటల్లో కూడా హింస పనికిరాదట."
" నిజమే తల్లీ. అహింసా పరమో ధర్మః అన్న సూక్తి అప్పుడే మర్చిపోయేను చూసేవా మీ అన్నయ్యకి కూడా నీ చేతనే చెప్పిస్తానుండు. నువ్వు రా అమ్మా టిఫిన్ చేద్దువు గాని " ఆ అహింసా వ్రత దీక్ష పూనిన మా అమ్మాయిని.
( ఇది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఇచ్చిన ధ్వని " అహింసా పరమో ధర్మః " కు ప్రతిధ్వనిగా నేను పంపగా తే.26.8.1988 దీని ప్రసారితమైంది.)
సేకరణ.....
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి