ఏది చర్య ......ఏది ప్రతిచర్య..!?
బుద్ధుడు ఖచ్చితంగా చెపుతాడు.. నిశ్శబ్దంగా కూర్చోవటం నేర్చుకోమని.
అంటే ఎప్పుడూ నిశ్శబ్దంగా కూర్చోమని కాదు. మీరు సోమరితనంగా వుండమని కాదు.
ఆ నిశ్శబ్దం నుండి మొదలయ్యేదే చర్య అంటాడు.
మీకా నిశ్శబ్దం తెలీకపోతే;
ఆ ప్రశాంతత.. నిశ్చలత్వం.. తెలీకపోతే;
మీరేమి చేసినా అది ప్రతిచర్య అవుతుంది.
ఎవరో మిమ్మల్ని అవమానిస్తారు.
మీకు కోపమొస్తుంది.
ఎవరో మిమ్మల్ని పొగుడుతారు.
మీకు సంతోష మొస్తుంది.
ఎవరో మిమ్మల్ని కించ పరుస్తారు
మీరందుకు కుంగిపోతారు.
అంటే ఎవరో స్విచ్ నొక్కుతారు.
మీరందుకు స్పందిస్తారు.
అంటే..
ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలరు.
బాధ పెట్టగలరు.
మీలో ద్వేషాన్ని రగిలించ గలరు.
మిమ్మల్ని పిచ్చివారిని కూడా చేయ గలరన్న మాట.
ఇతరులననుసరించి మీరు స్పందిస్తూ వున్నారంటే,
ఇతరులప్రభావంతో మీ ప్రవర్తన వుందనికదా అర్ధం.
ఇదంతా మీ చర్య ఎలా అవుతుంది..?
ప్రతిచర్య అవుతుంది గానీ!
బుద్ధుడు దీనిపై స్వీయపరిశోధన చేసాడు.
ఆ ప్రకారం బుద్ధుడు ఓ రోజు ఓ గ్రామం మీదుగా వెళుతున్నాడు.
బుద్ధుని తత్వం అర్ధంకాని వారికి బుద్ధుడొక పనిపాటలేని ఓ సోమరిలా అనిపించాడు. పైగా బోధనలంటూ అందరినీ చెడగొడుతున్నాడు కూడాను. ససేమిరా అది నచ్చని వారంతా దారికాసి.. బుద్ధుడిని నానా తిట్లూ తిట్టారు. ప్రశాంతంగా అన్నీ విన్నాక బుద్దుడు అన్నాడు..
"మీరంతా ఇంతదాకా వచ్చి.. నాకోసమని ఇంత సమయం వెచ్చించి నందుకు ధన్యవాదాలు. నేనిపుడు మరో గ్రామానికి వెళ్ళాలి. అక్కడా మీలా కొందరు నా కోసం ఎదురు చూస్తూ వున్నారు. రేపు వచ్చి వింటాను ఇంకా మిగిలినవన్నీ"
గ్రామస్తులు నిర్ఘాంత పోయారు. ఏమిటీ మనిషీ!? అసలు మనిషేనా..అదే విషయం అడిగేసారు..
సరే! కనీసం ఈ ఒక్కటీ చెప్పు. మేమిన్ని మాటలన్నాం కదా.. కనీసం ప్రతిగా ఒక్క మాటైనా లేదా నీవద్ద..!
నిజమే! మీకు నా జవాబు కావాలంటే 10 ఏళ్ళ క్రితం వచ్చి ఉండాల్సింది.. నావద్దకి. ఇప్పుడా మనిషి లేడిక్కడ. ఈ పదేళ్ళ కాలంలో నాలో ఇతరులవల్ల ప్రభావితం కావటమనే లక్షణం పోయింది. నాపై నేను మాత్రమే అధికారినిపుడు. నాకు నచినట్టుగా నేను ప్రవర్తిస్తాను. ఇతరుల వల్లకాదు. నా అంతర్గత అవసరాలకు అనుగుణంగా నేను నడుచుకొంటాను.
మీరు నన్ను తిట్టాలనుకున్నారు. తిట్టారు.
అందుకు మీరు సంతృప్తి పడండి.
మీ పని మీరు చక్కగా చేశారు..
ఐతే ఆ అవమానాన్ని నేను స్వీకరించలేదు.
అలా స్వీకరించనంత వరకు నాకది అర్ధరహితమైనదే కదా.
ఎవరైనా స్పందించారూ అంటే..
వారా అవమానాన్ని స్వీకరించారనీ, అంగీకరించారని కదా అర్ధం!
ఎవరైతే ఎరుకతో లేరో వారే కదా స్పందిస్తారు.
గ్రామస్తులంతా అవాక్కయ్యారు. ప్రత్యుత్తర మివ్వటానికి వారివద్ద మరేమీ మిగలలేదు.
బుద్ధునికి పాదాభివందనం చేయటం మినహా!
స్పృహలో లేని వ్యక్తే స్పందిస్తాడు.
బుద్ధిజీవి గమనిస్తాడు.
అతడి అంతర్గత శాంతినుండి నిశ్శబ్దంనుండీ..,..ఎరుక నుండీ.. అతడి చర్య పుడుతుంది.
స్వాభావిక ప్రవర్తన పుడుతుంది.
ఇతరులు ప్రభావితం చేయటం వల్ల కాదు.
ఇతరుల వల్ల కలిగేది ప్రతిచర్య మాత్రమే!
చర్య .......ప్రతిచర్యల కున్న తేడా ఇక్కడే.........
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి