ఎపుడో నలభై ఎండ్ల క్రిందటి మాట.ఆవునుతిన్న పులికథ.
దాదాపు నలభై సంవత్సరాల క్రిందట అనుకొంటా రావుకొండలరావు గారి కథ ఒకటి యువ మాసపత్రికలో ప్రచురితమైంది. కథపేరు గుర్తు లేదుకాని కథనంమాత్రం చాలా బాగా గుర్తుంది నాకు.
ఇది మనకు తెలిసిన ఆవు పులిలాంటి కథే అయినా ముగింపు మాత్రం పులి సహజధోరణి, ప్రవర్తన ఎలా వుంటుందో రావు కొండలరావుగారు అద్భుతంగా చూపారు. ఇంతకు కథ ఏమిటంటే...
గోవు ఒక్కటి అడవిలో మేతమేసుకొని ఇంటిదగ్గరున్న లేగదూడకు పాలివ్వటానికి ఆ సాయంత్రం వడివడిగా వస్తోంది. దార్లో ఆవును పులి అడ్డగించి బాగా ఆకలిగావుంది, నిన్ను తినేస్తానంది.
పుట్టిన ప్రతిప్రాణి ఎప్పుడో ఒకపుడు గిట్టకమానదు.పరుల ఆకలి తీర్చటానికి నా శరీరం ఉపయోగపడుతుందంటే అంతకంటే నాకింకేమి కావాలి అని ఆ ఆవు అంటూ
ఓ పులిరాజా నన్ను తిని నీ ఆకలితీర్చుకో, అయితే నాదో చిన్నమనవి ఇంటిదగ్గర ఆకలితో నా దూడ నా కోసం కాచివుంది. త్వరగా వెళ్ళి నా బిడ్డకు పాలిచ్చి, నాలుగు బుద్ధిమాటలు చెప్పి వచ్చేస్తాను అనుమతివ్వు అంటూ ప్రాధేయపడింది.
తప్పించుకోటానికి ఇదో ఎత్తు కుదరదు, వెళ్ళటానికి వీల్లేదంటూ గర్జించిందా పులి. దానికా గోమాత పులిరాజా నేను గోమాతను ఆడిన మాట తప్పను ఈ సూర్యచంద్రులు భూమ్యాకాశాలు మీద ఆన, నేను తప్పక తిరిగివస్తా నన్ను వెళ్ళనివ్వు అంటూ దీనంగా ప్రాధేయపడిందా ఆవు.
పులిరాజు ఏ కళనున్నాడో సరేనన్నాడు. ఆవు పరువులెత్తి లేగదూడకు పాలిచ్చి పులికి తాను ఇచ్చిన మాట గురించి చెప్పి నాయనా అమ్మలేని వాడు దూది కంటే దుమ్ముకంటే చులకన. అందుకే దుష్టసహవాసం చేయెద్దు. చెడు అలవాట్లనేర్చుకోవద్దు, బావులగట్ల వెంబడి మేతకు పోవద్దు, ఆడిన మాట తప్పకు అంటూ కన్నీళ్ళతో బోధించింది. ఏం చేయాలో తోచక దూడ చిట్టి హృదయం బాధతో నిట్టూర్చింది. దూడ కళ్ళల్లో కన్నీళ్ళ ధార, ఆవు కంఠంలో గద్గత. ఆవుదూడలు ఏడ్చుకొంటూ పరస్పరం వీడ్కోలు చెప్పుకొన్నాయి.
ఆవు పులి దగ్గరకు వచ్చింది. గోమాత నిజాయితికి, సత్యవాక్పరిపాలనకు పులి ఆశ్చర్యపడింది. ఇలాంటి సచ్ఛీలురాలునా నేను తిని ఆకలి తీర్చుకోనేది అంటూ ఆలోచించి ఆవు మంచి హృదయాన్ని చూచి భోరున ఏడుస్తూ, అమ్మా గోమాత నీలాంటి మంచివారిని ఆడిన మాట తప్పనివారిని నేను తినను నువ్వు స్వేచ్ఛగా వెళ్ళినీ బిడ్డను కలుసుకోవచ్చు అంటూ కాళ్ళమీద పడింది.
అమ్మా గోమాత నిన్ను నాకు ఆహారంగా పంపిన లేగదూడను ఒకసారి చూడాలనుంది.పిలుచుకు రా ఒక్కసారంటూ అడిగింది.
ఆవు దానికేం భాగ్యమంటూ ఇంటికి వెళ్ళి పులి మంచితనం గురించి తెలియచేసి ఒక్కసారి నిన్ను చూడాలని ఆ వ్యాఘ్రం కోరుతోంది వెళదాం రా అంటూ చిట్టిదూడను పులివద్దకు తీసుకువెళ్లింది.
ఆవుదూడను చూడగానే ఆ శార్ధూలం బిగ్గరగా గాండ్రించి పంజావిసిరి ఆవుదూడను ఒక్క దెబ్బతో చంపేసి దూడను టిఫిన్ గాను, గోమాతను భోజనంగాను తినేసింది.
ఇది నేటిసమాజంలో నీతినిజాయితికి వున్న విలువ.
*నిన్నటి రోజున (28:7: 2020 ) న మహనాటక రచయిత విలక్షణనటుడైన రావు కొండలరావుగారు కనుమూసారు. వారికి స్వర్గప్రాప్తి కలగాలని ప్రార్థిద్ధాం.*
.............................................................................................................
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి