ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వివాహం అంటే ఒకే వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడటం ..

 


కొత్త కాపురాన్ని చూడటానికి వచ్చిన తండ్రిని బీచ్‌కి తీసుకెళ్ళాడు కొడుకు. అతడి భార్య కూడా వారితో వచ్చింది. ముగ్గురూ ఇసుకలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. దూరంగా పిల్లలు తడి ఇసుకతో ఇళ్ళు కట్టుకుంటున్నారు. బీచ్ అంతా రష్‌గా ఉంది.


"ఎలా ఉంది కొత్త సంసారం?" అని అడిగాడు తండ్రి.


కొడుకు మాట్లాడలేదు. కోడలు మొహమాటంగా నవ్వింది.

ఇంతలో దూరంగా పిల్లల మధ్య గొడవ మొదలయింది. అందులో ఒక కుర్రవాడు పక్కవాడి గూటి మీద కాలు వేయటంతో ఆ ఇసుక ఇల్లు నేలమట్టం అయింది. అందరూ కలిసి వాణ్ణి కొట్టబోయారు. పెద్దలు వచ్చి వాళ్ళను విడిపించి సర్ది చెప్పారు.

"…నిన్న రాత్రి చాలాసేపు మీరు ఏదో విషయంలో గొడవ పడుతున్నారు. అర్ధరాత్రి వరకూ మీ మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి” తండ్రి అన్నాడు.

"అబ్బే అదేo లేదు మామయ్యగారూ" అంది కోడలు.

ఆయన నవ్వేడు. "మీకన్నా పాతికేళ్ళు పెద్దవాణ్ణి. నా దగ్గర దాచవద్దు. ఏ విషయంలో జరిగింది గొడవ?"

"నా కంప్యూటర్ ముట్టుకోవద్దని చెబుతూనే ఉంటాను. తనకి లాప్‌టాప్ ఉంది కదా. అనవసరంగా నా దాన్ని కెలుకుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి తయారు చేసుకున్న ఫైలు మొన్న డిలిట్ అయిపోయింది" నిష్ఠూరంగా అన్నాడు కొడుకు.

కోడలు వెంటనే "ఎంతో నీట్‌గా సర్దుకున్న నా షెల్ఫ్‌లో బట్టలన్నీ మొన్న మీరు చిందర వందర చేయలేదా? అయినా మీ వాచీ నా పట్టుచీరల మధ్యన ఎందుకుంటుంది?" అంది కోపంగా.

"పట్టుచీరలు చిందరవందర చేయటం, కంప్యూటర్‌లో ఫైలు డిలిట్ చేయటం ఒకటేనా?" అన్నాడు మరింత కోపంగా కొడుకు.

ముసలాయన నవ్వాడు. "నిన్న కూడా మీరు మొదట్లో చిన్న స్వరంతోనే మాట్లాడుకొని, ఆవేశం పెరిగాక పక్క గదిలో నేనున్నానని కూడా మర్చిపోయి నాకు వినిపించేంత గట్టిగా మాట్లాడుకున్నారు."

ఇద్దరూ సిగ్గుతో తలవంచుకున్నారు. ఈలోపు అప్పటి వరకూ ఆడుకుంటూన్న పిల్లలు అక్కడ నుండి వెళ్ళిపోయారు. పెద్దాయన అటే చూస్తూ "ఆ పిల్లలు కొట్టుకోవడం చూశారు కదా. మీకేమైనా అర్థం అయిందా?" అని అడిగాడు.

అర్థం కానట్టు చూశారు ఇద్దరూ.

"ఎలాగూ కూలిపోయే ఇసుక గూళ్ళ కోసం, పిల్లలందరూ కొట్టుకున్నారు. చీకటి పడేసరికి, గూళ్ళని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. మన జీవితాలు కూడా అంతే. కొంతకాలం బ్రతుకుతాం. ఆపై అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. ఈ కొద్దికాలం ‘ఎంత సంతోషంగా ఉండాలి? ఎలా సంతోషంగా ఉండాలి’ అని ఆలోచించాలి తప్ప, డెలీటయిపోయిన ఫైళ్ళ కోసం, నలిగిపోయిన పట్టు చీరల కోసం కొట్టుకుని మనసులూ, జీవితాలూ పాడుచేసుకోకూడదు."

" వివాహం అంటే ఒకే వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడటం....


Credit: Telegram User  Cnu master

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి