మానవ రక్తంలో ప్రధానంగా ఉండే A B, O అనే మూడు ప్రధాన గ్రూపులను గుర్తించి వైద్యశాస్త్రాన్ని కొత్త పుంతలు తొక్కించిన శాస్త్రవేత్తగా కార్ల్ లాండ్ స్టీనర్ సుప్రసిద్ధుడు. ఆస్ట్రియాలోని వియన్నాలో 1868 జూన్ 14న జన్మించారు కార్ల్. ఇవాళ రక్త మార్పిడి ద్వారా ఎన్నో ప్రాణాలు నిలుస్తున్నాయంటే అది ఆయన చలవే. అందుకే 1930లో వైద్యశాస్త్రంలో ఆయన నోబెల్ పురస్కారాన్ని పొందారు. ఈయనది O గ్రూప్
1891లో వియన్నా యూనివర్సిటీ నుంచి ఎం.డి. పట్టా పొందిన ఆయన ఐరోపాలో పలువురు పేరుపొందిన శాస్త్రవేత్తల దగ్గర ఆర్గానిక్ కెమిస్ట్రీని అధ్యయనం చేశారు. తిరిగి వియన్నా యూనివర్సిటీకి వచ్చి తనకెంతో ఇష్టమైన ఇమ్యునాలజీ రంగంలో పరిశోధనలు చేసి, 1901లో మానవ AB O బ్లడ్ గ్రూప్ వ్యవస్థ గురించి ప్రచురించారు. ఆ కాలానికే ఇద్దరు వ్యక్తుల రక్తాన్ని మిశ్రమం చేస్తే రియాక్షన్ వస్తుందనే విషయం తెలిసినా, దానికి కారణమేంటనే విషయం తెలీదు. భిన్న వ్యక్తులకు చెందిన రక్తం కలిసినప్పుడు ఎర్ర రక్త కణాల ఉపరితలంపై ఉండే కొన్ని యాంటీజెన్స్ వల్ల రియాక్షన్స్ వస్తాయని వెల్లడించిన కార్ల్, ఆ యాంటీజెన్ను A, B, C (తర్వాత దీన్ని O గా మార్చారు)గా గుర్తించారు. ఆ తర్వాతి ఏడాదే మరో బ్లడ్ గ్రూపును గుర్తించారు. అదే AB, A బ్లడ్ గ్రూప్ వ్యక్తికి B బ్లడ్ ను ఎక్కిస్తే, అతని నిరోధక వ్యవస్థ B యాంటీజెన్ను గుర్తించదనీ, ఫలితంగా అవి ఇన్ఫెక్షన్కు గురిచేసి, ప్రమాదకరంగా పరిణమిస్తాయనీ కార్ల్ కనిపెట్టారు. దాంతో ఒక బ్లడ్ గ్రూప్ కు చెందిన వ్యక్తికి అదే గ్రూప్ రక్తాన్ని ఎక్కిస్తేనే ప్రయోజనం ఉంటుందని ఆయన తేల్చారు.
అప్పట్నుంచే రక్త మార్పిడి ప్రక్రియ మొదలై వైద్యశాస్త్ర రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేసింది. మానవ బ్లడ్ గ్రూప్లపై అధ్యయనంతో సరిపెట్టలేదు కార్ల్. సైన్సు ఇతరత్రా కూడా కీలక సేవలందించారు. రుమేనియా శాస్త్రవేత్త కాన్స్టాంటిన్ లెవడిటితో కలిసి పోలియో వ్యాధికి కారణమైన సూక్ష్మజీవిని ఆయన కనిపెట్టారు. అలా పోలియో వాక్సిన్ వృద్ధికి ఆయన పునాది వేశారు. అంతేనా ! సిఫిలిస్ వ్యాధికి కారణమైన సూక్ష్మజీవుల్ని గుర్తించడంలోనూ ఆయన తోడ్పాటునందించారు. తన పరిశోధనల సారాంశాన్ని ఆయన 'ద స్పెసిఫిసిటీ ఆఫ్ సెరొలాజికల్ రియాక్షన్స్' (1986) పేరుతో ప్రచురించారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 1943 జూన్ 26న ఆయన మృతి చెందారు.
Credits: శర్మ గారు, మనం పత్రిక సౌజన్యంతో...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి