మనిషి గొప్పవాడు కావాలని నిరంతరం కలలు కంటుంటాడు. ధనాశ కలిగినవాడు కుబేరుణ్ని మించి పోవాలనుకుంటాడు. అధికారదాహం కలవాడు అత్యున్నతస్థాయి కుర్చీని ఆక్రమించుకోవాలనుకుంటాడు. జ్ఞాని పరమజ్ఞానిగా, సాధకుడు సిద్ధుడిగా, శూరుడు యోధుడిగా, వైద్యుడు ధన్వంతరి సమంగా... ఇలా ఉంటాయి ఆశల కలలు. కలలు వేరు, వాస్తవం వేరు.
ధాన్యాన్ని సంచుల్లోనే ఉంచుకుని, పదింతల పంటకోసం కలలు కనడం ఎంతవరకు సబబు? హలాలతో పొలాలు దున్ని భూమాతను నమ్ముకుని తగినంతగా కృషి చెయ్యాల్సి ఉంటుంది. కలలు కృషితో జత కలిసినప్పుడే సత్ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగి తన ప్రజ్ఞకు పదును పెట్టుకుంటూ, అంకితభావంతో పనిచేసినప్పుడే పదోన్నతులు లభిస్తాయి. తన కళ్లముందు తనకంటే వెనకవాళ్లు అభివృద్ధి సోపానాలు ఎక్కుతుంటే అసూయతో రగిలిపోవడం మన ఆరోగ్యానికే చేటు. అలాగే విద్యార్థులు కూడా. అమూల్యమైన సమయాన్ని ఆటపాటలు, వినోదాలతో వ్యర్థం చేసుకుంటే ఉత్తీర్ణతే కష్టం కావచ్చు. ఇక ఉన్నతశ్రేణికి అవకాశం ఎలా ఉంటుంది? గతించిన కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కిరాదు. సర్వసమర్థుడైన భగవంతుడైనా కాలాన్ని వెనక్కితిప్పడు. కోట్లాది రూపాయలు గుమ్మరించినా గతించిన క్షణాల్ని తిరిగిపొందడం అసాధ్యం. కానీ, చాలామంది ఈ సత్యాన్ని గమనికలోకి తీసుకోరు.
‘నేను చాలా తప్పులు చేశాను. తల్లిదండ్రుల్ని హింసలుపెట్టాను. ఒక్కసారి వారికి మళ్ళీ సేవలు చేసే అవకాశం ఇవ్వు భగవంతుడా’ అని ఎంత మొత్తుకున్నా- పోయినవాళ్లు మళ్ళీ ప్రత్యక్షం కారు.
*సమయం మన చేతుల్లో ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ధనం పుష్కలంగా ఉన్నప్పుడే దానధర్మాలు చెయ్యాలి*. యౌవనంలో ఉండగానే తీర్థయాత్రలు చేయాలి. *బాలుడిగా ఉన్నప్పుడే శ్రద్ధగా విద్యాభ్యాసం చేయాలి. మనసు మనమాట వినే సమయంలోనే ఆధ్యాత్మిక సాధన చేయాలి. మంచిచెడుల విచక్షణ కల్పించే జ్ఞానాన్ని సదా రక్షించుకోవాలి
కుబేరుడు శ్రీనివాసుడికి రుణం ఇచ్చిన కథ ఉంది. అంతటి ధనసంపన్నుడూ ఎవరికీ ఎక్కడా దానధర్మాలు చేసిన కథలు కనిపించవు. అందువల్ల కుబేరుడికి భక్తులుండరు. సిరుల దేవత శ్రీమహాలక్ష్మిని ఎందరో ఆరాధిస్తారు. ఆ తల్లి చల్లనిచూపు పడితే చాలనుకుంటారు. ఎందుకంటే ఆ మహాదేవి అనుగ్రహమే అమోఘదానంతో సమానం.
ప్రపంచంలో కుబేర సమానులెంతమంది ఉన్నా- సత్కార్యాలు, దానధర్మాలు చేయనిదే వాళ్లకు గుర్తింపు ఉండదు. కాబట్టి, తన సంపదను పంచడంతోపాటు, తోటివారిని ఆదుకునే తత్వాన్ని పెంచుకోవాలి! అవధులెరుగని దాత అనిపించుకోదగినవాడు భగవంతుడొక్కడే. ఆయన దాతలకే దాత.ఎదుగుదలను భౌతికంగా, సిరిసంపదలు, అధికారహోదాలకు, విద్యాధిక్యత, జ్ఞానసంపదకు ముడిపెట్టుకున్నంత కాలం మనిషి సత్యానికి దూరంగా ఉంటాడు.
అసలు సత్యమేమిటంటే, మనలోని సంస్కారం ఒక్కో మెట్టు ఎదగాలి. సంపూర్ణ సంస్కారవంతుడికి ఎవరి ఎదుగుదలపట్లా అసూయ, ద్వేషాలు ఉండవు. తులసి మొక్క సర్వలోకపూజిత. అది ఎప్పుడూ చిన్నదిగానే ఉంటుంది. తాడిచెట్టు చాలా ఎత్తుగా ఉంటుంది. కానీ, తులసి మొక్క పవిత్రత ముందు అది ఎందుకూ కొరగాదు. అభివృద్ధి సోపానాలు ఎక్కడానికి ఆరాటపడటం కంటే మన అర్హతలు పెంచుకునేందుకు కృషిచేయడం చాలాముఖ్యం. ఎవరో మనల్ని మించిపోతున్నారనే దుగ్ధ మన ఎదుగుదలకు ప్రధాన అవరోధం కనుక, ఆ భావాన్ని మనలోకి రానివ్వకూడదు. మనం మనంగానే ఉండాలి. మనకు లభించాల్సినవి లభిస్తూనే ఉంటాయి. పెరగాల్సింది సంస్కారం. మరేవీ కావు. ఇదే జీవన విజయసూత్రం!
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి