ఒకసారి ఒక రాజుగారు గుర్రంపై సవారీ చేస్తూ ఒక ఇంటి దగ్గర నిలబడ్డాడు.
ఆ ఇoటిలో ఒక ఆవిడ వాళ్ళ ఆయనకు అన్నము వడ్డిస్తూ వుంది. ఆమె చాల అందగత్తె, ఆవిడ అందము చూసి రాజుగార్కి ఆశ్చర్యము కలిగింది, ఆమె అందానికి వివశుడై మోహంలో పడిపోయాడు. నా రాజ్యములో ఇoత అందమైన స్త్రీని ఇదివరకు చూడలేదే అని అనుకున్నాడు.
ఆమె భర్త భోజనo చేసి తన పనికై బయటికి వెళ్ళాడు.
భర్తను పంపించి ఆవిడ వాకిలి మూసేసి ఇంట్లోకి వెళ్ళింది.
అప్పుడా రాజు ఇoటి తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తెరిచి చూడగా ఆయన వేషధారణను బట్టి ఎవరో రాజవంశానికి చెందిన వ్యక్తి అనుకున్నది. ఎవరు మీరు అని ప్రశ్నించింది.
రాజుగారు తన గురించి చెప్పుకుంటూ నేను ఈ రాజ్యానికి రాజును, నీవు చాలా అందంగా వున్నావు, నీ అందం నన్ను కట్టిపడవేస్తోంది. నిన్ను నా భార్యగ చేసుకోవాలి అనుకుంటున్నాను, నీవు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుని నా రాజ్యానికి మహారాణిని చేస్తాను, నీవు చూడని సంపద చూడగలవు, అడుగులకు మడుగులోత్తే పనివారు, కాలు కింద పెట్టకుండా చూసుకునే బాధ్యతనాది అన్నాడు.
ఆమె గుణవంతురాలు మరియు మంచి సంస్కారము కలది. ఆవిడ రాజుగారితో ఇలా అన్నది. రాజా! తప్పకుండా మీ కోరిక తీరుస్తాను, ముందు మీరు అలసిపోయి వుంటారు. శరీరం,మనసు రెండు ఆకలితో వుంటాయి. మీరు వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మని చెప్పింది.
ఆమె అంగీకారంతో రాజు ఆనందానికి అవధులు లేవు. ఇంత సులువుగా తన కోరిక తీరుతందని, ఆవిడ అంగీకరిస్తుందనీ ఊహించలేదు. ఆవిడ అంగీకరించకపోతే తన అధికారంతో అయినా ఆవిడను చేరబట్టాలనుకున్నాడు. కానీ పరిస్థితులు అంత దూరం దారితీయనందుకు తన ఆనందం అంతా ఇంతా కాదు. కాళ్ళుచేతులు కడుగుకొని ఇంటిలోనికి వెళ్ళాడు.
రాజా! మీరు భోంచేయండి! అంటూ వాళ్ళ ఆయన తినిన అరిటిఆకును రాజు ముందు వేసి ఇలా అన్నది, ఇప్పుడే మావారు ఇదే ఆకులో భోంచేసి వెళ్ళారు, అదే ఎంగిలి ఆకులో మీరూ భోజనము చేయండి. మీ ఆకలి తీరాక నేను మీతో వస్తాను మీరాజ్యానికి అన్నది.
రాజుకు ఊహించని ఆ పరిణామానికి ఆమెపై కోపము, ఆ ఎంగిలి ఆకును చూసి అసహ్యము కలిగాయి. దేశాన్నేలే ప్రభువును నేను, ఎప్పుడూ బంగారు పళ్ళెంలో ఘుమఘుమలాడే షడ్రసోపేతమయిన వంటకాలు వేడివేడిగా తినే నాకు ఈ ఎంగిలి ఆకులో భోజనము వడ్డించడానికి నీకెంత ధైర్యము అని గద్దించాడు.
అందుకు సమాధానంగా ఆమె ఇలా చెప్పింది.
మహరాజా! నా భర్త భోజనము చేసిన విస్తరాకు ఎంగిలిది అంటున్నారే, మరి నా శరీరాన్ని ప్రేమించే మీకు ఎంగిలి అడ్డురాలేదా? పెళ్ళైన నన్ను మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి అడ్డురాని ఎంగిలి, భోంచేసే విస్తరాకు విషయంలో కలిగిందా? ఎంత ఆశ్చర్యము అన్నది.
రాజుకు ఆమె మాటలలోని అంతరార్ధం అర్ధమయ్యింది. కనువిప్పు కలిగింది.మోహం పటా పంచలయ్యింది. ఆవిడ సంస్కారానికి , సమయస్పూర్తికి ముగ్ధుడయ్యాడు. ఆవిడ పాదాల మీద పడి నమస్కరించాడు. చేతులు జోడించి తల్లీ! నన్ను క్షమించు! కేవలం బాహ్యసౌందర్యాన్ని చూసి ఇంద్రియనిగ్రహం కోల్పోయి అవివేకంతో అజ్ఞానిలా ప్రవర్తించాను. నీవు ఎంతో నేర్పుగా నాకు సుక్ష్మాన్ని దర్శింపజేశావు. నేను చూపిన ఆశలకు లోబడక నీ పాతివ్రత్యాన్ని ప్రదర్శించావు. నీవంటి మాతృమూర్తులవల్లే ధర్మం ఇంకా జీవించి ఉన్నది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
పరాయి స్త్రీ పై వ్యామోహం ఎంగిలిఆకులో భోజనము ఒక్కటే.
స్త్రీలలో ఆడతనాన్ని గాక అమ్మతనాన్ని దర్శించిన వారు కృతార్దువులవుతారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి